Sunday, April 12, 2026

రోడ్డు భద్రతలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

MS8NEWS జనవరి 16: రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరిఖని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన “ఎరైవ్ ఎలైవ్” అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ఇతరులను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణను ఒక సామాజిక బాధ్యతగా భావించాలని, సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఉద్యోగులు అవగాహన కల్పిస్తే ప్రజల్లో మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ మరియు ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పని చేస్తూ ప్రమాదాల నివారణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

​అదనపు కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ, నగరంలో రోడ్ల వెడల్పుతో పాటు భద్రతకు సంబంధించిన అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. జిల్లా స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సూచనలను అమలు చేస్తున్నామని, ప్రయాణాల్లో సమయపాలన పాటిస్తే తొందరపాటు వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. అనంతరం పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రమాదాల వల్ల బాధితుల కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను వివరించారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం మరియు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా ఉండటం వంటి ప్రాథమిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం నగదు పురస్కారం ఇస్తుందని, బాధితులకు లక్షా యాభై వేల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Related Articles

Most Popular