(MS8NEWS జనవరి 13):ఉప్పల్ : సంక్రాంతి పండుగ వేళ గాలిపటాల మాంజా మరో ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన వివరాలు:
నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు, ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) బందోబస్తు విధుల్లో ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఉప్పల్లోని తన నివాసం నుండి విధులకు వెళ్లేందుకు బైక్పై బయలుదేరారు.
మెడకు చుట్టుకున్న మాంజా:
సౌత్ స్వరూప్ నగర్ వద్దకు చేరుకోగానే, గాలిలో తెగివచ్చిన చైనీస్ మాంజా అకస్మాత్తుగా ఆయన మెడకు చుట్టుకుంది. బైక్ వేగంగా ఉండటంతో మాంజా గొంతులోకి దిగి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆయనను చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం నాగరాజుకు అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది. గొంతు భాగంలో లోతైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత మాంజా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

