(MS8NEWS జనవరి 7):రామగుండం (గోదావరిఖని):మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం ఉదయం స్థానిక గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘మహిళా బిగ్ బాస్ స్వశక్తి సహకార సంఘాల’ ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వశక్తి సంఘాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ, తమ కాళ్లపై తాము నిలబడటం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళలు ఎదుర్కొంటున్న స్థానిక మరియు వృత్తిపరమైన సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. “మహిళల సాధికారతే నా ప్రధాన లక్ష్యం. స్వశక్తి సంఘాల అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అని రాజ్ ఠాకూర్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్వశక్తి సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

