MS8NEWS గోదావరిఖని, జనవరి 22:రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. గురువారం గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్యాథ్ ల్యాబ్ (Cath Lab) పనులను సింగరేణి జీఎం లలిత్ కుమార్ గారితో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే, నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు::క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి వస్తే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు కరీంనగర్ లేదా హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఇక్కడే మెరుగైన చికిత్స అందుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు వేగంగా ఆసుపత్రికి చేరుకునేలా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆసుపత్రికి రెండు ప్రవేశ మార్గాలు (Double Entrance) ఉండాలని అధికారులకు సూచించారు.
మౌలిక సదుపాయాల కల్పన: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులు, వైద్య సిబ్బంది మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

