(MS8NEWS డిసెంబర్ 23) : జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలో మొసలి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మండల పరిధిలోని మద్దెలబండ చిన్న తండా గ్రామ సమీపంలో గల వ్యవసాయ పొలాల్లో సోమవారం ఒక భారీ మొసలి కనిపించింది. ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులకు అకస్మాత్తుగా మొసలి కనిపించడంతో మొదట భయాందోళనకు లోనయ్యారు. అయితే, అది జనావాసాల్లోకి రాకుండా అప్రమత్తమైన రైతులు చాకచక్యంగా వ్యవహరించారు. స్థానిక రైతులు ఐకమత్యంతో మొసలిని చుట్టుముట్టి, తాళ్లతో సురక్షితంగా బంధించారు. అనంతరం గ్రామస్తులంతా అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. మొసలిని బంధించిన రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

